

ఆందోళన అవసరం లేదు
- అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
*దశల వారి ప్రక్రియకు కార్యాచరణ
జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్
ఖమ్మం ఫిబ్రవరి 20: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ పేర్కొన్నారు.
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ సూచన మేరకు జర్నలిస్టుల బృందం సోమవారం జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ కు వినతి పత్రం సమర్పించారు.
అర్హులైన జర్నలిస్టులందరికీ ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇచ్చిన హామీలను వర్తింపజేయాలని విజ్ఞప్తి చేస్తూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసి తమ న్యాయబద్ధమైన సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు.
ఈ సందర్భంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు మాట్లాడుతూ.. అనేక ఏళ్లుగా జర్నలిస్టు వృత్తిని నమ్ముకొని , అనేక కష్టనష్టాలను అనుభవిస్తూ నిరంతరం పనిచేస్తున్నారని, అటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం కొందరికే సర్వే జరిగిందని, మిగిలిన వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ సర్వే జరిపించి న్యాయం చేయాలని కోరారు. జిల్లా కేంద్రానికి చెందిన జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
దీనికి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ స్పందిస్తూ… జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశంపై ప్రక్రియ కొనసాగుతుందని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇతర ప్రాంతాలకు చెందిన వారిని గుర్తించి, లోకల్ వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. దశల వారి ప్రక్రియలో భాగంగా అర్హులైన జర్నలిస్టుల అందరికీ ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు టిఎస్ చక్రవర్తి, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కి గోపి, ఉపాధ్యక్షులు ముత్యాల కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి జీవన్ రెడ్డి, మహిళ ప్రతినిధి వంగూరి ఈశ్వరి, యూనియన్ జిల్లా, నగర నాయకులు పానకాలరావు, వేర్పుల నాగేశ్వరరావు, మోహన్, మందుల వెంకటేశ్వర్లు, పులి శ్రీనివాస్, పురుషోత్తం, వెంకటేష్, పప్పుల వేణు గోపాల్, ఉపేందర్, బండి కుమార్, ప్రకాష్ , మనోహర్, నాగరాజు, ఖాసీం, గణేష్, జి. కుమార్ , రామారావు,నరేష్, ఈసంపల్లి వెంకటేశ్వర్లు వెంపటి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
