★బీజేపీ హఠావో సింగరేణి బచావో:- మంత్రి పువ్వాడ

◆సింగరేణిని కాపాడుకుంటాం..మోడీకి గుణపాఠం చెపుతాం:- మంత్రి అజయ్ కుమార్

◆వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని మంత్రి పువ్వాడ డిమాండ్

◆బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో మహాధర్నా

కేంద్ర ప్రభుత్వం సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలన్న కుట్రలకు పాల్పడుతోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. తాజాగా సింగరేణిలోని మరోసారి బొగ్గు గనుల వేలానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొత్తగూడెం లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ సింగరేణి ఒక కంపెనీ మాత్రమే కాదని.. తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారమని అన్నారు.ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలని కేంద్రానికి అనేకమార్లు విజ్ఞప్తి చేస్తున్న కేంద్రం మాత్రం కుట్రపూరితంగా గనుల వేలం ప్రక్రియను మరోసారి తెరపైకి తీసుకువచ్చిందని అజయ్ కుమార్ అన్నారు. ఇప్పటికే పలుమార్లు గనుల వేలం ప్రక్రియ ప్రయత్నం చేసిన ప్రైవేటు కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాలేదని, మరోవైపు ఇవే గనులని నేరుగా సింగరేణికి కేటాయించాలని అనేక సంవత్సరాలుగా కోరుతున్నామని కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటు సింగరేణి కార్మికులు తెలంగాణ ప్రజలు ఏకకంఠంతో సింగరేణి కోసం ప్రత్యేకంగా గనులు కేటాయించాలని కోరినా, పట్టించుకోకుండా మరోసారి సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణ పల్లి, పెన గడప గనుల వేలం కోసం మరోసారి నోటిఫికేషన్ కేంద్రం ఇచ్చిందన్నారు. మార్చి 29 నుంచి మే 30 వరకు ఈ గనులకు వేలం ప్రక్రియను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా సింగరేణికి నేరుగా బొగ్గు గనులను కేటాయించాలని మంత్రి పువ్వాడ డిమాండ్ చేశారు. తెలంగాణను దెబ్బ కొట్టాలన్న దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం పదేపదే సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలు కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. ఇప్పటికే సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను భారత రాష్ట్ర సమితి తరపున, అలాగే తెలంగాణ ప్రభుత్వం పక్షాన తీవ్రంగా వ్యతిరేకించామని మంత్రి పువ్వాడ అజయ్ గుర్తు చేశారు. ఈ మేరకు సింగరేణికి అవసరమైన బొగ్గు గనులను నేరుగా కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. అయితే ఇప్పటికే లాభాల్లో నడుస్తున్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వం సింగరేణిని కూడా తెగ నమ్మాలని కంకణం కట్టుకుందని మంత్రి అజయ్ ఆరోపించారు. లాభాల బాటలో వున్న సింగరేణికి.. భవిష్యత్తులో బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల బాట పట్టించాలన్న కుతంత్రంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతుందని దుయ్యబట్టారు. పోరాటాల పురుటిగడ్డ అయిన తెలంగాణలో.. ఎట్టపరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వ కుట్రలను అడ్డుకుని తీరుతామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో దాగుడుమూతలు ఆడుతున్న కేంద్ర ప్రభుత్వం పైకోమాట.. అంతర్గతంగా లోపలో కుట్రకు తెర లేపుతుందని అన్నారు.న మరోసారి రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ తెలంగాణకు ఏమి చేశారు అని దుయ్యబట్టారు. అటు ఉత్పత్తిలోనూ, లాభాల్లోనూ, పిఎల్ఎఫ్ లోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సింగరేణిని ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పే దమ్ము కేంద్ర ప్రభుత్వంలోనే ఏ ఒక్కరికైనా ఉందా అని నిలదీశారు.సింగరేణి సంక్షోభంలోకి వెళితే దక్షిణ భారతదేశ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ కుప్పకూలుతుందనే సంగతి ప్రధానికి తెలియదా అని ప్రశ్నించారు.సింగరేణి ప్రైవేటీకరణ అనేది కేవలం ఆరు జిల్లాల సమస్య కాదని, సమస్త తెలంగాణ అంశమని, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే భారీ కుట్రలో భాగంగానే ఇది జరుగుతోంది మంత్రి పువ్వాడ చెప్పారు. రాష్ట్రంలోని రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న సీఎం కేసిఆర్ గారి సంకల్పాన్ని ఎలాగైనా దెబ్బతీయాలన్న కేంద్రం కుట్ర ఇందులో దాగి ఉందని మండిపడ్డారు. బోర్లపై ఆధారపడ్డ అన్నదాతల బతుకులు మళ్లీ బోర్లాపడేలా చేయాలన్నదే బీజేపీ దురుద్దేశమని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న గుర్తింపు, గౌరవాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం ఓర్వలేకపోతోందన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే జంగ్ సైరన్ మోగిస్తామని… మరో ప్రజా ఉద్యమం నిర్మిస్తామని హెచ్చరించారు. గతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సింగరేణి నుంచే ఉవ్వెత్తున ఎగిసి గమ్యాన్ని ముద్దాడిందన్నారు. ఈ సారి పురుడుపోసుకునే మహోద్యమంతో.. కేంద్ర ప్రభుత్వం కుప్పకూలక తప్పదని మంత్రి పువ్వాడ అజయ్ హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు,ఎమ్మెల్యేలు వనమ వెంకటేశ్వరరావు,సండ్ర వెంకటవీరయ్య,కందాల ఉపేంద్ర రెడ్డి,మెచ్చ నాగేశ్వరరావు,బాణోత్ హరిప్రియ, లావుడ్యా రాములు నాయక్,ఎమ్మెల్సీ తాత మధు,జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు,ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ,సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డిసిసిబి డిసిఎంఎస్ చైర్మన్ లు నాగభూషణం,శేషగిరిరావు,మాజీ ఎమ్మెల్సీ వెంకట్ రావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్లు రాజేందర్, ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్లు వెంకటేశ్వరరావు, సీత మహాలక్ష్మి మరియు ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed