డిప్యూటీ సీఎం ప్రెస్ మీట్ @తెలంగాణ భవన్, న్యూఢిల్లీ.

ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత తెలంగాణ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు

భట్టి విక్రమార్క గారి కామెంట్స్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వపరంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్య, ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం మొట్ట మొదటిసారిగా దేశ ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం హోదాలో (భట్టి విక్రమార్క) నేను కలవడం జరిగింది.

తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రానికి రావలసిన విభజన చట్టంలోని హక్కులు, ప్రయోజనాల గురించి దేశ ప్రధాని మోడీ దృష్టికి తీసుకు వెళ్ళాం

తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి కోరి తెచ్చుకున్నదే.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం. వీటికి సంబంధించి విభజన చట్టంలో పేర్కొన్న హక్కులను సాధించడంలో పది సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది.

విభజన చట్టం ద్వారా తెలంగాణకు రావలసిన హక్కులు, హామీలను త్వరితగతిన అమలు చేయాలని ప్రధాని మోడీని ఈ సందర్భంగా కోరడం జరిగింది

బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటిఐఆర్ ప్రాజెక్టులను వెంటనే ఏర్పాటు చేయడం కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాము

తెలంగాణ కావాలని ఏ నీళ్ల కోసం పోరాటం చేసామో… ఆ నీళ్లను ఈ రాష్ట్రానికి అందించడానికి విభజన చట్టంలో పొందుపరిచినట్టుగా సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని అందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పరిగణలోకి తీసుకొని సాంక్షన్ ఇవ్వాలని కోరడం జరిగింది

ఐఏఎం, సైనిక్ స్కూల్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 14 రోడ్ల ప్రతిపాదనలు, విభజన చట్టం ప్రకారం బ్యాక్ డెవలప్మెంట్ ఫండ్ పెండింగ్ గ్రాంట్స్ విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారికి ఆదేశాలు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశాము.

2019 -20 నుంచి 2023- 24 వరకు పెండింగ్లో ఉన్న దాదాపు 1800 కోట్ల రూపాయలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాము

తెలంగాణ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన తెలంగాణగా నిర్మించాల్సిన బిఆర్ఎస్ ఆర్థిక అరాచకంతో ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని, మించిన అప్పులు తెచ్చి రాష్ట్రంపై పెనుబారం మోపిన విషయాన్ని ఈ సందర్భంగా మోడీ దృష్టికి తీసుకువెళ్ళాం.

ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ భవిష్యత్తు ఆర్థిక అవసరాలను తీర్చేందుకు పెండింగ్ బకాయిలు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశాము.

2019 -20, 2020-21 సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ బకాయిలు 450 కోట్ల రూపాయలను విడుదల చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన 2,250 కోట్ల రూపాయల గ్రాంట్స్ ను సాధ్యమైనంత వీలుగా విడుదల చేయాలని కోరాము

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టడం కోసం సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం విద్యా వైద్య వ్యవస్థలను బలోపేతం చేయడం కోసం ఇతోధికంగా
కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలను అందించాలని చేసిన తమ విజ్ఞప్తిని ప్రధానమంత్రి సానుకూలంగా స్పందించారు.

కేంద్రం ఒక రాష్ట్రానికి అందించాల్సిన సాయం ఏ విధంగా అందిస్తామో అదేవిధంగా అందిస్తామని ప్రధానమంత్రి స్పందించినట్లు చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం వివరాల గురించి ప్రధానమంత్రి కి నివేదిక ఇవ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed