*ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 20వ డివిజన్ రామచంద్రయ్య నగర్ లో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల*






నగరం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఫైనల్ చేసి ప్రభుత్వంచే ఆమోదింప చేసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
గురువారం మంత్రి, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 20వ డివిజన్ రామచంద్రయ్య నగర్ లో టి.యు.ఎఫ్.ఐ. డి.సి. నిధులు 72 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా *మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ* రెవెన్యూ సంబంధించిన భూ సమస్యల అంశాలను అదనపు కలెక్టర్, మున్సిపాలిటీకి సంబంధించిన అంశాలను కమీషనర్ బాధ్యత తీసుకొని పరిష్కరించాలని అన్నారు.
ఖమ్మం నగర అభివృద్ధి మాస్టర్ ప్లాన్ త్వరలోనే ఆమోదించడం జరుగుతుందని, ఫైనల్ చేసే ముందు ప్రజాప్రతినిధులను సంప్రదిస్తామని అన్నారు. ఖమ్మం మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందిన తర్వాత పెండింగ్ భవన నిర్మాణాలు అనుమతులు త్వరగా జారీ చేయాలని అన్నారు.
ప్రభుత్వ భూములను రక్షించి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని అదనపు కలెక్టర్ కు సూచించారు. నగర అభివృద్ధికి మనమంతా సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. నగరంలో పేద ప్రజలకు మధ్య తరగతి వారికి ఏం కావాలో ఒక్కొక్కటిగా పూర్తి చేసే బాధ్యత తాను తీసుకుంటానని, ప్రశాంతమైన ప్రగతి సాధించిన ఖమ్మంను తయారు చేస్తామని అన్నారు.
పేదలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని రకాల హామీలను అమలు చేస్తూ అభివృద్ధి పనులను కూడా ఎక్కడ వెనకాడకుండా పూర్తి చేస్తామని అన్నారు.
ఈ సందర్భంగా *నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ* నగర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేశామని, వచ్చే వారం నాటికి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువడుతుందని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 58 ప్రకారం పట్టాలు సంబంధించి రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుంటూ వెరిఫికేషన్ చేస్తున్నామని, ఇది పూర్తయిన తర్వాత ప్రత్యేక రెవెన్యూ క్యాంపెయిన్ నిర్వహించి అర్హులకు ఇంటి పట్టాలు, హౌస్ నెంబర్ కేటాయిస్తామని అన్నారు.
ప్రభుత్వ భూముల సంరక్షణకు కూడా కోర్టు ఆదేశాల ప్రకారం ఏడి సర్వే అండ్ ల్యాండ్ అధికారులతో ప్రత్యేకంగా సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేయడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో *అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ,* నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన భూములు ఆక్రమణకు గురైనట్లు సమాచారం అందిందని, రేపటి వరకు దానిని స్వాధీనం చేసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర మేయర్ పూనుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతీమా జోహారా, స్థానిక కార్పొరేటర్ ప్రశాంతి లక్ష్మి, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

