రాజకీయాలకతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అమలు… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు

**57వ డివిజన్ లో రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను, రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంత్రి తుమ్మల
ఖమ్మం, ఆగస్టు 24 (( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ))

రాజకీయాలకతీతంగా పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.

మంత్రివర్యులు, ఆదివారం ఖమ్మం 57వ డివిజన్ రమణ గుట్ట ప్రాంతంలో 2 కోట్ల 36 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ 57వ డివిజన్ ప్రాంతంలో పేదలు ఎక్కువ ఉన్నారని స్థానిక నాయకులు కోరగా ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను అధికంగా ఇక్కడ కేటాయించడం జరిగిందని అన్నారు. ఖమ్మం నగరంలో 2000 ఇండ్లు మంజూరు చేస్తే కేవలం 57వ డివిజన్ పరిధిలో 200 పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసామని అన్నారు.

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు విడతల వారీగా ప్రభుత్వం మంజూరు చేస్తుందని అన్నారు. ఈ ప్రాంతంలో పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ సాధ్యం ఉన్నంత వరకు కృషి చేస్తామని అన్నారు. రాజకీయాలకతీతంగా నిరుపేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని అన్నారు.

లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లు త్వరగా నిర్మించుకునేలా చూడాలని, డివిజన్ లో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైయిన్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తి చేయాలని, ఒకసారి చేసిన అభివృద్ధి పని పది కాలాల పాటు నిలిచి పోవాలని అన్నారు. పాఠశాల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని, వర్షాకాలం ముగిసిన వెంటనే పనులు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు, సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ్ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కులు, రేషన్ కార్డులు వంటి సంక్షేమ పథకాలను పేదల ఇంటి వద్దకు వెళ్లి అందించాలని అన్నారు.

కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ పేదల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రి తుమ్మల కృషి ఫలితంగా 230 మంది లబ్ధిదారులకు 57వ డివిజన్ లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం సరఫరా, రేషన్ కార్డులను జారీ చేశామని అన్నారు.

ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని, ఇండోర్ పట్టణంలో పాటిస్తున్న పారిశుధ్య చర్యలను మన ఖమ్మం నగరంలో కూడా అమలు చేసేందుకు చర్యలు చేపడతామని అన్నారు. మురుగు కాల్వలలో ప్లాస్టిక్ కవర్లు పడేయవద్దని అన్నారు.

అనంతరం మంత్రి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, మునిసిపల్ ఇంజినీరింగ్ ఖమ్మం డివిజన్ కార్య నిర్వాహక ఇంజనీర్ వి. రంజిత్, ఖమ్మం అర్బన్ తహసిల్దార్ సైదులు, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed