


బీసీలపై రాజకీయ వివక్షత దుర్మార్గం
— బిసిలకు 22శాతం రిజర్వేషన్ లను పట్టిష్టంగా అమలు చేయాలి
— బీసీ రిజర్వేషన్లపై జిల్లా కలెక్టర్ పునర్ ఆలోచనచేసి న్యాయం చేయాలి
— న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తాం
— బీసీ జేఏసీ రాష్ట్ర నాయకులు ఆర్జెసి కృష్ణ, మేకల సుగుణారావు
ఖమ్మం, నవంబర్ 25 : కాంగ్రెస్ ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీలకు హామీ ఇచ్చారన్నారు. కోర్టు పరిధిలో ఉన్నందున జీవో నెంబర్ 46 ప్రకారం బీసీలకు 22 శాతం అమలు అమలు చేయకుండా 11.7 శాతం అమలుచేసేందుకు ప్రయత్నం చేస్తూ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని బీసీ జేఏసీ రాష్ట్ర నాయకులు ఆర్జెసి కృష్ణ, మేకల సుగుణారావు అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేస్తుందని ఆరోపించారు. జీవో 46 ప్రకారం బీసీలకు 22శాతం రిజర్వేషన్ ను అమలు చేయకుండా 11.7శాతం రిజర్వేషన్లు అమలు చేయడం దారుణం అన్నారు. అన్ని రాజకీయ పక్షాలు బీసీ రిజర్వేషన్లుపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. రఘునాథపాలెం, తిరుమలాయపాలెం మండలాల్లో సగానికి పైగా ఉన్న బీసీలకు ఒక్క రిజర్వేషన్ కూడా ప్రకటించకపోవడం దుర్మార్గం అన్నారు. జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ బిసి రిజర్వేషన్లపై పునర్ ఆలోచన చేసి బీసీలకు న్యాయం చేయాలని కోరారు. బీసీలకు 22 శాతం అమలయ్యేంతవరకు న్యాయపోరాటం చేస్తామని వారు డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బిసి జేఏసీ నాయకులు, పిట్టల నాగేశ్వరరావు, కూరాకుల నాగభూషణం, పెరుగు వెంకటరమణ యాదవ్, కొలిచెలం గీత, చల్ల హనుమంతు, చైతన్య తదితరులు పాల్గొన్నారు.
