
ఖమ్మం పార్లమెంటుకు మంత్రుల కుటుంబసభ్యులకు నో టికెట్… తేల్చిచెప్పిన కాంగ్రెస్ అధిష్టానం… వేరే పేర్లు సూచించాలని కోరిన ఏఐసీసీ అయోమయంలో మంత్రులు… కీంకర్త్యం అనే ఆలోచనతో మల్లగుల్లాలు మంత్రులతో విడి వీడిగా రాహుల్ తో పాటు అంతరంగికుల చర్చలు మళ్ళీ ఆశావహులు రంగంలోకి… వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ (రాజా) కు అవకాశం ఉగాది తర్వాత పేరు ప్రకటిస్తారని ప్రచారం. ఖమ్మం పార్లమెంట్ కు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని పెట్టాలనే దానిపై ఇంకా తర్జన భర్జనలు జరుగుతున్నాయి. జిల్లాలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు తమ కుటుంబసభ్యులకే టికెట్ ఇప్పించుకోవాలనే పట్టుదలతో ఉండటంతో అధిష్టానానికి ఇబ్బందికరంగా మారింది. ఎవరి కుటుంబసభ్యులను ఎంపిక చేసిన మరొకరికి కోపం వస్తుందనే ఉద్దేశంతో ఖమ్మం లోకసభకు కుటుంబసభ్యులకు నో టికెట్ అనే విషయాన్నీ స్పష్టం చేసినట్లు అంత్యంత విశ్వసనీయ సమాచారం. జిల్లాకు చెందిన మంత్రులనే వేరే పేర్లు సూచించాలని చెప్పినట్లు తెలిసింది. దీంతో మంత్రులు అయోమయంలో పడ్డారు. అతి సులువుగా గెలిచే సీటు అయినందున తమ వారికీ టికెట్ ఇస్తే బాగుంటుందని తమ శక్తిని అంతా ఉపయోగించినప్పటికీ ఫలితం లేకుండా పోతుందనే అభిప్రాయంతో మదనపడుతున్నారు. ఫలితంగా కీంకర్త్యం అనే ఆలోచనలో మంత్రులు మల్లగుల్లాలు పడుతున్నారు. శనివారం జనజాతర సభకు వచ్చిన రాహుల్ గాంధీ బస చేసిన హోటల్ కు జిల్లాకు చెందిన నేతలను పిలిచి టికెట్ విషయంపై క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. అయితే చివర ప్రయత్నంగా వారు రాహుల్ సన్నిహితులవద్ద తమ అభిప్రాయాలను తెలిపి తమ వారికే టికెట్ ఇవ్వాలని కోరారని అందుకు అదిసాధ్యం కాకపోవచ్చునని వేరే పేర్లు ఉంటె సూచించాలని వారికీ నిష్కర్షగానే చెప్పినట్లు తెలుస్తుంది. కొత్త వారిలో ఖమ్మం జిల్లా వాసి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు, ప్రముఖ వ్యాపారవేత్త… వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ (రాజా) కి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని భావిస్తున్నారు.
