ఖమ్మం అక్టోబర్ 19 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు


సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు కు కొంగోత్త సబ్ కలెక్టరేట్
కల్లూరులో ఇంటిగ్రేటెడ్ మోడల్ సబ్ కలెక్టర్ కార్యాలయం
•రాష్ట్రంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ మోడల్ సబ్ కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణానికి మంత్రి ఆలోచన
•మంత్రి”తుమ్మల”ఆలోచనకు కొత్త రూపు
•10ఎకరాలు రూ. 49 కోట్లతో ప్రతిపాదనలు
•మంత్రి తుమ్మలకు ప్రతిపాదన అందించిన సబ్ కలెక్టర్
•క్యాంప్ ఆఫీస్-కమ్-రెసిడెన్స్ నిర్మాణానికి రూ.2.50 కోట్లు
•ప్రజలకు మెరుగైన పరిపాలన లక్ష్యంగా అడుగులు
•పరిపాలన చేరువ చేయాలనే సంకల్పంతో మంత్రి కృషి
•సీఎం రేవంత్ తో భేటీకానున్న మంత్రి తుమ్మల
•సత్తుపల్లి,కల్లూరు,వేంసూరు,పెనుబల్లి,తల్లాడ చెరువులకు పూర్వవైభవం
•ప్రభుత్వ ఎన్ఎస్పి, భూములను కబ్జాదారుల నుండి విముక్తి కలిగించాలి
•సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ కు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆలోచనతో కల్లూరులో అన్ని హంగులతో కొత్త ఇంటిగ్రేటెడ్ మోడల్ సబ్ కలెక్టరేట్ కార్యాలయం రూపుదిద్దుకోనుంది. కల్లూరు సబ్ కలెక్టరేట్ వేదికగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట కొలువుదీరనున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖలలో ప్రజలకు సమగ్ర సేవలు, సమర్థవంతమైన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈ సబ్ కలెక్టరేట్ ను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ మోడల్ సబ్ కలెక్టరేట్ గా కల్లూరు సబ్ కలెక్టరేట్ నిలవనుంది. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కల్లూరు సబ్ కలెక్టర్ ను ఇంటిగ్రేటెడ్ సబ్ డివిజనల్ కలెక్టరేట్ గా ప్రతిపాదన తయారు చేయాలని సబ్ కలెక్టర్ ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆదివారం సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ మంత్రి తుమ్మలకు సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రతిపాదనలు అందించారు. ఈ విషయమై మంత్రి తుమ్మల సీఎం రేవంత్ రెడ్డి తో త్వరలో భేటీ అయ్యి, ఈ నూతన ప్రాజెక్టుకు సీఎం ఆమోదం కోరనున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల సబ్ కలెక్టర్ కు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూములు, ఎన్ఎస్సీపీ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్రమణలో ఉన్న చెరువులకు విముక్తి, భూ ఆక్రమణల తొలగింపు, చెరువుల సుందరీకరణకు ఆదేశించారు.
10ఎకరాల్లో రూ.49 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్…
కల్లూరు మండలంలో పది ఎకరాల భూమిలో రూ.49 కోట్ల అంచనా వ్యయంతో ఈ సబ్ కలెక్టరేట్ సముదాయం నిర్మించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో సబ్ కలెక్టరేట్ ప్రధాన భవనం, విభాగాల కార్యాలయాలు, సమావేశ మందిరాలు, రికార్డు గదులు, పార్కింగ్ స్థలాలు, హరిత వాతావరణం వంటి అన్ని ఆధునిక సౌకర్యాలతో నిర్మించనున్నారు.
క్యాంప్ ఆఫీస్-కమ్-రెసిడెన్స్కు రూ.2.50 కోట్లు….
సబ్ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్-కమ్-రెసిడెన్స్ నిర్మాణానికి ప్రత్యేకంగా రూ.2.50 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేశారు. ఈ ప్రాజెక్టు వివరాలను సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సమర్పించారు. ఈ ప్రతిపాదన ఆమోదం కోసం త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రతిపదనలు మంత్రిగారు సమర్పించనున్నారు.
ప్రజలకు పరిపాలన చేరువే లక్ష్యం….
“ప్రజలకు ఒక్కచోటే అన్ని ప్రభుత్వ శాఖల సేవలు పొందగలిగేలా పరిపాలన చేరువ కావాలి” అనే ఉద్దేశంతోనే ఈ ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఆదాయ, వ్యవసాయం, పంచాయతీరాజ్, పౌర సరఫరాలు, మహిళా సంక్షేమం, విద్య తదితర శాఖల డివిజన్ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో పనిచేయనున్నాయి.
చెరువులకు పూర్వవైభవం – ఐదు మండలాల్లో అభివృద్ధి….
సత్తుపల్లి, కల్లూరు, వేంసూరు, పెనుబల్లి, తల్లాడ మండలాల్లో ఉన్న చెరువుల పునరుద్ధరణకు మంత్రి తుమ్మల ప్రత్యేక దృష్టి సారించారు. ఈ చెరువులను మోడల్ చెరువులుగా తీర్చిదిద్దాలని, వాటి అభివృద్ధికి సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చెరువుల పరిరక్షణ బాధ్యతను సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.
వేశ్యకాంతుల చెరువుకు సర్వే ఆదేశం…
సత్తుపల్లి మండలంలోని వేశ్యకాంతుల చెరువుపై సర్వే చేపట్టి, చెరువును పరిరక్షించాలని మంత్రి తుమ్మల సూచించారు. చెరువు భూములకు కబ్జాల నుంచి విముక్తి కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వేంసూరు మండలం కుంచపర్తి గ్రామంలో గ్రామ రాశి భూములపై సర్వే చేపట్టి, వాటిని కబ్జాదారుల నుండి రక్షించాలని ఆదేశించారు.
ప్రభుత్వ భూముల రక్షణకు స్పష్టమైన ఆదేశాలు…
“ప్రభుత్వ, ఎన్ఎస్పీ భూములను కబ్జాల నుంచి కాపాడాలి. ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న భూములకు చట్టపరంగా విముక్తి కల్పించాలి . భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలి” అని మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రేవంత్తో భేటీకి సిద్ధమైన మంత్రి తుమ్మల…
కల్లూరు మోడల్ సబ్ కలెక్టరేట్ నిర్మాణం, చెరువుల అభివృద్ధి ప్రణాళికలు, భూ పరిరక్షణ చర్యలపై మంత్రి తుమ్మల త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి, సమగ్ర నివేదిక సమర్పించనున్నారు.
పరిపాలనా వ్యవస్థలో కొత్త దిశ….
కల్లూరులో ప్రతిపాదిత మోడల్ సబ్ కలెక్టరేట్ నిర్మాణం అమల్లోకి వస్తే, ఇది రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో కొత్త దిశను సూచించే నమూనాగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు సమగ్ర సేవలందించే ఈ సముదాయం భవిష్యత్తులో ఇతర జిల్లాలకు ప్రేరణగా మారనుంది.
