
పెరుగుతున్న తుమ్మల గ్రాఫ్
వరుసగా కాగ్రెస్లోకి చేరికలు..
తుమ్మల గూటికి మందడపు బ్రహ్మారెడ్డి
నిత్యం ఆత్మీయ సమ్మేళనాలు, క్షణం తీరికలేని పర్యటనలు
ఖమ్మం బ్యూరో, తేజ న్యూస్ తెలంగాణ న్యూస్ఖమ్మం సిటీఉమ్మడి రాష్ట్రంలోనే విభిన్న తీర్పుకు కేంద్ర బింధువుగా చెప్పుకునే ఖమ్మం నియోజకవర్గంలో మాజీ సీనియర్ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది తుమ్మల నాగేశ్వరరావు గ్రాఫ్ అనూహ్యంగా పెరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ మంత్రి వర్గంలో గడిచిన ఐదేండ్లుగా మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్కుమార్పై పోటీచేస్తున్న తుమ్మల నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటూ తనను గెలిపించాలని కోరుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిచయం అక్కరలేని పేరు తుమ్మల నాగేశ్వరరావు. నాలుగు దశాబ్దాల మచ్చలేని సుదీర్ఘ రాజకీయ చరిత్ర. ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి మంత్రిగా పనిచేసిన అనుభవం.. అభివృద్ధే ద్యేయంగా సాగుతున్న తుమ్మల ప్రస్థానం.. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి ప్రజాతీర్పును గౌరవించే ఉన్నత ఆశయం తుమ్మల సొంతం. బీఆర్ఎస్లో టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి బీఆర్ఎస్ వీడి ఇటీవల ఏఐసీసీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
తుమ్మలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన గెలుపు..ప్రస్తుత రణక్షేత్రంలో తుమ్మల అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తన గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంత్రి పువ్వాడ అజయ్కు పట్టున్న రఘునాథపాలెం మండలంతో పాటు, ఖమ్మంలోని వివిధ డివిజన్లలో నిత్యం ప్రజలను కలుస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలను ముఖ్య నాయకులను కాంగ్రెస్ గూటికి రప్పిస్తున్నారు. తుమ్మల వెంట మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, టీపీసీసీ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్నేని రామారావు, ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ వడ్డెబోయిన నర్సింహారావు, సాధు రమేష్ రెడ్డి, కార్పొరేటర్లు కమర్తపు మురళి, చావా నారాయణరావు, రావూరి సైదుబాబు, మాజీ కార్పొరేటర్ నాగండ్ల దీపక్చౌదరి, జంగం భాస్కర్, తదితరులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఖమ్మం నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే తుమ్మల గ్రాఫ్ పెరుగుతుందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా తుమ్మల రాకతో బీఆర్ఎస్ను వీడిన కొందరు నాయకులతో పాటు రెండు రోజుల కిందట మైనారిటీల ముఖ్య నాయకుడు, ఖమ్మం మాజీ ఎమ్మెల్యే యూనిస్ సుల్తాన్, ఆయన ఇద్దరు కుమారులు, జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అశ్రిఫ్, రెండు రోజుల కిందట బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు, తెలంగాణ ఉద్యమ కారుడు రడం సురేష్ గౌడ్, వైటీపీ ఖమ్మం జిల్లా బాధ్యుడు తుంపాల కృష్ణమోహన్, తాజాగా డీసీసీబీ డైరెక్టర్, ధంసలాపురం మాజీ సర్పంచ్ మందడపు బ్రహ్మారెడ్డితో పాటు వైసీపీ కార్యకర్తలు తుమ్మల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. బ్రహ్మారెడ్డి చేరికతో ఖమ్మంలోని 16, 17, 18,19, డివిజన్లతో పాటు కీలకమైన ముస్తాఫా నగర్ ప్రాంతాల్లో కాంగ్రెస్కు భారీగా ఓట్లు క్రాస్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు రోజుల రఘునాథపాలెంలో ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు, టీపీసీసీ సభ్యులు, మహ్మద్ జావేద్ సారధ్యంలో తుమ్మలకు ప్రజలు భారీగా స్వాగతం పలకడంతో పాటు కాంగ్రెస్లో చేరడం తుమ్మల శిబిరంలో కొత్త ఉత్సాహం కలిగిస్తోంది. రఘునాథపాలెంలో పలువురు కాంగ్రెస్లోకి రావడం మరింతగా కాంగ్రెస్ శ్రేణులు దూకుడు పెంచాయి.
తెలంగాణ ఉద్యమకారులు, టీడీపీ మద్దతు తుమ్మలకేనా..?‘రాజకీయంగా నా ప్రస్థానం ప్రారంభించిన స్థలం ఇదే..రాజకీయంగా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన పవిత్ర భవనం.. నా దేవుడు ఎన్టీఆర్ ఇచ్చిన వరం..చంద్రబాబు పెంపకం..భవిష్యత్తులోనూ నా మూల సిద్ధాంతమైన పేదలకు అండగా ఉండటం మరిచిపోలేను..’ అని తుమ్మల నాగేశ్వరరావు వందలాది మంది టీడీపీ కార్యకర్తల కేరింతల నడుమ ప్రకటించడంతో జై తుమ్మల, జై జై తుమ్మల అని నినాదాలు హోరిత్తించారు. చంద్రబాబుకు బెయిల్ వచ్చిన సందర్భంగా టీడీపీ కార్యాలయానికి వెళ్లిన తుమ్మల, బాలసాని తదితరులను చూడగానే టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున కేరింతలు కొడుతూ ఘన స్వాగతం పలికారు. ప్రస్తుత ఎన్నికల్లో మా మద్దతు తుమ్మలకేనని ప్రకటించారు. అపార్ట్మెంట్లు, పెట్రోలు బంక్ యూనియన్లు, ప్రయివేటు విద్యాసంస్థలు, వాకర్స్, పెన్షనర్లు, వివిధ ప్రజా సంఘాల ఆత్మీయ సమ్మేళనాలతో తుమ్మల బృందం క్షణం తీరికలేకుండా పర్యటనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా బుధవారం ఖమ్మంలో తెలంగాణ ఉద్యమకారులు డా.ఎంఎఫ్ గోపీనాథ్, డా.కేవీ కృష్ణారావు, తదితరులు ఏర్పాటుచేసిన తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో తుమ్మలకు ఘనస్వాగతం లభించింది. వారికి అండగా ఉంటానని తుమ్మల అభయం ఇచ్చారు.
వ్యూహాత్మకంగా తుమ్మలను బరిలో దింపిన కాంగ్రెస్..ఇప్పటికే ఖమ్మం గుమ్మంలో రెండు సార్లు గెలిచి ఊపుమీదున్న మంత్రి పువ్వాడకు చెక్ పెట్టాలంటే ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లే కీలకమని భావించిన కాంగ్రెస్ తుమ్మలను వ్యూహాత్మకంగా బరిలో నిలిపింది. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న తుమ్మల గతంలో ఖమ్మంలోనూ ఎమ్మెల్యేగా పనిచేసి ఉండటంతో పాటు సుదీర్ఘంగా మంత్రి హోదాలో ఖమ్మంలో పనిచేశారు. ఆ అనుభవం, పరిచయాలు ప్రస్తుత ఎన్నికల్లో తుమ్మల గ్రాఫ్ అనూహ్యంగా పెరుగుతుందని నియోజకవర్గ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
